సింగపూర్‌కు చేరుకున్న చిరంజీవి, పవన్ కల్యాణ్ – మార్క్ శంకర్‌ సురక్షితంగానే ఉన్నారు అన్న పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఏడున్నరేళ్ల వయసున్న మార్క్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్‌లోని ఒక షాప్‌హౌస్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఈ బిల్డింగ్‌లోనే ఉన్న టమాటో కుకింగ్ స్కూల్‌లో మార్క్ చదువుకుంటున్నాడు. పొగ కారణంగా ఊపిరాడక ఇబ్బందిపడ్డ ఆయనకు, చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అల్లూరి జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, గిరిజనులతో భేటీ అనంతరం రాత్రి 11.30 గంటలకు శంషాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరారు. ఆయనతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లారు.

ఈ అగ్నిప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది చిన్నారులుగా గుర్తించారు. సమీప భవనాలతో కలిపి 80 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. సాధారణంగా భద్రతాపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండే సింగపూర్‌లో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా ప్రస్తుతం సింగపూర్‌లోనే మార్క్‌తో ఉన్నారు. కుమారుడి ఆరోగ్యం పై స్పందించిన పవన్ కల్యాణ్, అందరి ఆశీస్సులతో మార్క్ కోలుకుంటున్నాడని వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సింగపూర్‌లోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేసి, అవసరమైన సహాయం అందించాలంటూ విదేశాంగ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

మార్క్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ సహా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ మార్క్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరగా కోలుకుంటున్నాడని పవన్ ఓ నోటు విడుదల చేశారు. అన్ని దిశల నుంచి లభిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens