పహల్గామ్ ఉగ్రదాడిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీకి ఫోన్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో అమాయక పౌరుల మృతికి దారితీసిన విషయం పట్ల శుక్రవారం ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మృతుల పట్ల ఆయన వ్యక్తిగత సంతాపం తెలియజేశారు.
ఈ కష్టకాలంలో భారత్కు, భారత ప్రజలకు ఫ్రాన్స్ అండగా నిలుస్తుందని మాక్రాన్ హామీ ఇచ్చారు. మిత్రదేశాలతో కలిసి ఉగ్రవాదంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడిని ఆమోదయోగ్యమైన అనాగరిక చర్యగా మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.
ఫ్రాన్స్ మద్దతుకు, సంఘీభావానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలనే భారత్ బలమైన సంకల్పాన్ని ఆయన మాక్రాన్కు తెలియజేశారు.
ఈ ఉగ్రదాడి మంగళవారం అనంత్నాగ్ జిల్లా బైసరన్ ప్రాంతంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా స్పందించి, భారత్కు తమ మద్దతు ప్రకటించాయి.