2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
ఇదే కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు సమాచారం
గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. హైదరాబాద్ రాయదుర్గలోని ‘మై హోం భుజా’లో ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుమీదుగా విజయవాడకు తరలిస్తున్నట్టు సమాచారం.
అయితే, పోలీసులు ఆయనను టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే అరెస్ట్ చేశారా? లేక మరో కేసులోనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. ఈ కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతూ వంశీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 20న విచారణ జరగాల్సి ఉంది. కానీ, విచారణకు ముందే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.