చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ గత సంవత్సరం గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. స్టాక్ ఫైలింగ్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, బీవైడీ 2024లో 777.1 బిలియన్ యువాన్లు (సుమారు ₹9.15 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో ₹8.30 లక్షల కోట్ల ఆదాయంతో ఉన్న టెస్లాను అధిగమించింది. అంతేకాకుండా, ఈ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో కూడా విస్తరిస్తోంది.
చైనా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బీవైడీ అగ్రగామిగా నిలిచింది. 2023తో పోలిస్తే 29% వృద్ధిని సాధించింది. ఈ ఆదాయం బ్లూమ్బెర్గ్ అంచనా వేసిన 766 బిలియన్ యువాన్ల కంటే ఎక్కువ. బీవైడీ నికర లాభం 40.3 బిలియన్ యువాన్లు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 34% అధికం.
ఇటీవల బీవైడీ కొత్త బ్యాటరీ సాంకేతికతను ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 5 నిమిషాల ఛార్జింగ్తో 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రకటన తర్వాత బీవైడీ షేర్ ధరలు భారీగా పెరిగాయి. బీవైడీ తెలిపిన తాజా బ్యాటరీ & ఛార్జింగ్ సిస్టమ్ 1,000kW సామర్థ్యంతో ఛార్జ్ చేయగలదు, ఇది టెస్లా సూపర్ ఛార్జర్ల కంటే వేగవంతమైనది. ప్రస్తుతం టెస్లా సూపర్ ఛార్జర్లు 500kW వేగంతో ఛార్జింగ్ను అందిస్తున్నాయి.