హైదరాబాద్, మార్చి 9: తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు మార్చి 10న విడుదల చేయనున్నారు, అయితే, ఈ రోజు అంగీకరించిన మార్కులు మాత్రమే వెల్లడికానున్నాయి. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటించి, ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారికి రీకౌంటింగ్ ఆప్షన్లు ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత 1:2 నిష్పత్తిలో జాబితాను విడుదల చేయనుంది.
మార్చి 10 (సోమవారం)న, గ్రూప్ 1 ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. అదే విధంగా, ప్రతి పేపర్లో సాధించిన మార్కులు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంటాయి.
ప్రాథమిక జాబితాలో ఉన్న మార్కులపై సందేహాలు ఉన్నవారు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు రూ. 1000 చొప్పున చెల్లించి, ఆన్లైన్లో రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు, ఆ దరఖాస్తులను పరిశీలించి మార్కులను తిరిగి లెక్కిస్తారు. తప్పులు సరిచేసి, మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను విడుదల చేస్తారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
దళారులను నమ్మొద్దు: టీజీపీఎస్సీ తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవపట్టించే సమాచారాన్ని నమ్మవద్దని టీజీపీఎస్సీ ఛైర్మన్ అభ్యర్థులను హెచ్చరించారు. కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని, మధ్యవర్తులు తప్పు సమాచారంతో మోసపెట్టే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారు ఎవరైనా సంప్రదిస్తే, వెంటనే టీజీపీఎస్సీ మొబైల్ నంబర్ 99667 00339 లేదా ఈ-మెయిల్ vigilance@tspsc.gov.in కు ఫిర్యాదు చేయాలని సూచించారు.