కుప్పంలో రంజాన్ విందులో పాల్గొన్న భువనేశ్వరి
-
ప్రార్థనలు వింటే ఆధ్యాత్మిక భావన కలిగిందన్న భువనేశ్వరి
-
అన్ని మతాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
-
"ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవిస్తాం" - నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు తొలిసారిగా కుప్పంలో జరిగిన రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ పవిత్రమైనదని, ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇది తన మొదటి ఇఫ్తార్ విందు అని, గుడికి వెళ్లినప్పుడు కలిగే పవిత్ర భావన లాగే అనిపించిందని చెప్పారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు వింటుంటే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని ఆమె పేర్కొన్నారు. కుప్పంలో ఇలా ముస్లిం సోదరులతో కలిసి వేడుకలో పాల్గొనడం మరింత సంతోషంగా ఉందని, అల్లాహ్ అందరినీ క్షేమంగా ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వాలు ముస్లిం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూటమి ప్రభుత్వం అన్ని కులాల, మతాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవిస్తూ, అందరూ సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తమపై ఉందని భరోసా ఇచ్చారు. ప్రతీ మతాన్ని గౌరవిస్తూ, వివిధ పథకాలను అమలు చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు.