విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించనున్న దుకాణ సముదాయం (షాపింగ్ మాల్), హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూకేటాయింపులు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లులూ గ్రూప్ ప్రతిపాదనలను పరిశీలించి భూకేటాయింపులు జరపాలని ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ వెల్లడించింది.
2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2023లో ఈ భూకేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. లులూ గ్రూప్ ఇప్పుడు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణం కోసం ముందుకు వచ్చింది.